Wednesday, July 13, 2011

అష్టావధానము - డా.మేడసాని మోహన్ - రెండవ భాగము

వర్ణన: 18వ తానా ద్వైవార్షిక సభలను వర్ణించమని కోరారు.




           నవ విన్యాస విలాస వైభవము సంధానమ్ము గావించుచున్

           వివిధోద్వీర కళాప్రసంగములలో విద్వత్స్పురద్గోష్ఠిలో

           దివినే మైమరపింపజేసెడి మహోత్తేజంబు తానా సభా

           నివతస్ఫూర్తుల గోచరించెడిది వర్ణింపన్ అసఖ్యంబగున్



ఆశువు-1: తానా సభలకు వచ్చిన కోనేటిరాయుడిని స్తుతిస్తూ..



           తిరుమల వేంకటేశ్వరుడి దివ్య మహాద్భుత వైభవంబులన్

           సరసత అన్నమయ్య విరసత్ స్థవదీయ శుభ ప్రసంగముల్

           పరగగ జేసినాడవు భవ్య గుణోన్నతి ఇందువచ్చినన్

           కరములనెత్తి తా నమెరికా ధర సుస్థలి గూడ కొల్చు సు

           స్థిరతను గాంచి వేంకటపతిన్ నుతియింతును భక్తి యుక్తి తోన్



ఆశువు-2: తానా వారి తెలుగు భోజనం వర్ణిస్తూ..



           విలసితప్రసన్న రుచుల వేడ్కగొల్పునట్టివై

           అలకులికిన మంచిరుచులు అద్భుతావహంబులై

           తెలుగువారి వంటకాల దివ్యరుచులతోడ ఈ

           ఇల వహించి తాన వార మెచ్చుచుంటి తీయగన్





ఆశువు-3: బంగారు భవిష్యత్తుకై పిల్లలను అమెరికా పంపించి, వారిని విడిచి ఉండలేక అమెరికా వచ్చి, ఇక్కడ ఇమడలేక సతమతమయ్యే పెద్దలను వర్ణించ వలెను.



                 భారతీయ జీవన విధా ప్రభితమైన

                 ఆర్ద్ర భావన మనములో అమరి యుండ

                 ఇక్కడి నివాస యోగ్యమౌ ఇక్కటులకు

                 పెద్దలుండంగజాలరు ఇద్ద చరిత



కాయ పఠణము-1: జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కుంతీ కుమారి నుండి

కావ్య పఠణము -2: నంది తిమ్మన విరచిత పారిజాతాపహరణము నుండి

కావ్య పఠణము-3: రామరాజ భూషణుని వసుచరిత్ర నుండి



అప్రస్తుతము:

1. అర్ధనారీశ్వరుడు హైదరాబాదు బస్సు ఎక్కితే ఆడవారి సీటులో కూర్చోవాలా లేక మగవారి సీటులోనా?

2. అరుంధతి పెళ్ళిలో ఆమెకు ఏ నక్షత్రం చూపించారంటారు?

3. పెళ్ళిలో ఉప్మా ఎందుకు అంత రుచిగా ఉంటుంది?

4. అందరూ శృంగార పరమైన సమస్యలడుగుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగేమైనా జరిగిందా?

5. కోడి లెక్కలంటే ఏమిటి?

6. సిగరెట్టు త్రాగాడని, నీళ్ళు నమిలాడని అంటారేమిటి?

7. ఐశ్వర్యారాయ్ కి పుట్టేది మగ పిల్లడా ఆడపిల్లా?





ముగింపు:

అవధానిగారు తుఫాన్ ఎక్స్‌ప్రెస్సు వేగంలో పద్యాలు చెప్పడం మూలంగానూ, నా రికార్డింగుని మళ్ళి మళ్ళీ విని నే వ్రాసిన తప్పులు సవరించే సమయం నాకు లేకపోవడం మూలంగా, పైన పద్యాలలో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు. ఆ తప్పులు నావిగా భావించి మన్నించ గలరు.



జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు, గొల్లపూడి మారుతీ రావు వంటి ప్రభుతులు సభలో ఉండడం మూలంగా అవధాని ఇంతకుపూర్వం వారిచ్చిన సమస్యలకు తన పూరణలు చెప్పి సభనలరించారు. అక్కిరాజు గారు శ్రావ్యమైన గళంతో కావ్యపఠణానికి వన్నె తెచ్చారు. సమయాభాం వలననుకుంటా చివరి ఆవృత్తంలో ఆశువు మరియు కావ్యపఠనము అంశాలను వదిలివేసారు. అప్రస్తుత ప్రసంగంలోని కొన్ని ప్రశ్నలకు అవధానిగారు చమత్కారంగా సమాధానాలిచ్చినా కొన్నిటిని దాటేసారనిపించింది. అయినాకానీ, ఇచ్చిన సమస్యలే కాకుండా చాలా ఉదారణలతో, చమత్కారాలతో అవధానాన్ని చక్కగా నిర్వహించి రక్తి కట్టించారు మేడసాని మోహన్ గారు.

No comments: